రోడ్డు ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్లు, ప్రమాదకర కూడళ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్

ప్రజాలహరి మిర్యాలగూడ ; రోడ్డు ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్లు, ప్రమాదకర కూడళ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్

జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ బుధవారం జిల్లాలోని ప్రమాదాలకు గురయ్యే బ్లాక్ స్పాట్స్ (Accident Prone Areas) ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్.హెచ్ 02,ఎన్.హెచ్ 167లో గల తరచూ ప్రమాదాలు జరుగు బ్లాక్ స్పాట్స్ అయినా వెల్‌కమ్ టూ మిర్యాలగూడ జంక్షన్, నందిపాడు ఎక్స్ రోడ్డు, చిల్లాపురం క్రాస్ రోడ్డు, చింతపల్లి క్రాస్ రోడ్డు, జంకుతాడా రోడ్డు, మిర్యాలగూడ అప్రోచ్ రోడ్డు ప్రాంతాలను సందర్శించి అక్కడ తరచూ ప్రమాదాలు జరగడానికి గల కారణాలను సంబంధిత అధికారులతో సమీక్షించారు. ప్రమాదాలు ఎక్కువగా జరగడానికి ప్రధాన కారణాలు అతివేగం, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం, ప్రమాదకర ఓవర్‌టేకింగ్, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం, రహదారి కూడళ్ల వద్ద స్పష్టమైన హెచ్చరిక బోర్డులు లేకపోవడం, రోడ్ మార్కింగ్‌లు చెరిగిపోవడం, అక్రమ పార్కింగ్, రాత్రి వేళల్లో తగిన వెలుతురు లేకపోవడం, రహదారులపై అనధికారిక ప్రవేశాలు (Unauthorized Openings) వంటి అంశాలని ఎస్పీ గుర్తించారు.    పరిశీలన సందర్భంగా ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు ఎస్పీ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు, జీబ్రా క్రాసింగ్‌లు, సెంటర్ లైన్లు, రోడ్ మార్కింగ్‌లకు రీ-పెయింటింగ్, రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు, సీసీ కెమెరాల ఏర్పాటు, బారికేడింగ్, రిఫ్లెక్టివ్ హెచ్చరిక బోర్డులు, దిశా సూచికలు, క్యాట్ ఐస్ ఏర్పాటు వంటి పనులను అత్యవసరంగా పూర్తి చేయాలని సూచించారు. అలాగే అన్ని జంక్షన్ల వద్ద అక్రమ పార్కింగ్ పూర్తిగా తొలగించి వాహనాల రాకపోకలకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.    అదేవిధంగా ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్, ట్రాఫిక్, పోలీసు మరియు ఇతర సంబంధిత శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి ప్రమాదకర ప్రాంతాల్లో ఉన్న లోపాలను వెంటనే గుర్తించి శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని సూచించారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాల్లో అనవసర జంక్షన్లు, అనధికారిక కట్స్ (Openings) సాధ్యమైనంత వరకు మూసివేయడం, అవసరమైన చోట మాత్రమే నియంత్రిత యూ-టర్న్‌లు కల్పించడం, ప్రమాదకర కూడళ్ల వద్ద ట్రాఫిక్ పోలీసు సిబ్బందిని అధిక సంఖ్యలో నియమించి వాహనాల రాకపోకలను నియంత్రించడం, ట్రాఫిక్ ఉల్లంఘనలపై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించడం, రద్దీ సమయాల్లో ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల్లో అధిక శాతం మానవ తప్పిదాల వల్లే జరుగుతున్నాయని, వాహనదారులు అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ డ్రైవింగ్ చేయడం, నిర్లక్ష్యంగా ఓవర్‌టేకింగ్ చేయడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, కార్లలో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా అనేక ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు.   జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పోలీసు శాఖతో పాటు అన్ని సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి, ప్రమాదకర ప్రాంతాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను త్వరితగతిన ఏర్పాటు చేసి ప్రజల ప్రాణ రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ పరిశీలనలో మిర్యాలగూడ ఇంచార్జ్ డిఎస్పీ రవి,సీఐ లు పి. ఎన్. డి ప్రసాద్, సోమనర్సయ్య, నాగభూషణ్,నాగరాజు, ఎస్.ఐ లక్ష్మయ్య,డి.టి.ఆర్.బి ఇంచార్జ్ రిటైర్డ్ సీఐ అంజయ్య, సంబంధిత రోడ్డు భద్రత అధికారులు ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్ ,ఎక్సైజ్,ట్రాన్స్ ఫోర్ట్ అధికారులు,మరియు స్థానిక ప్రజలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Previous post

మిర్యాలగూడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డు (UDID) కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి-BLR

Next post

మిర్యాలగూడలో పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ సుధా బాలకృష్ణ

You May Have Missed